TELANGANA

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, ప్రజా కళాకారుడు గద్దరన్నకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.

 

ఆడబిడ్డల ఫోన్లు వినేవాడు మనిషేనా?

 

సభలో ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు వింటే ఏదో అర్థముంది కానీ.. అసలు సంబంధం లేని ఆడబిడ్డల వ్యక్తిగత సంభాషణలను కూడా విన్నారంటే అలా చేసినవాడు అసలు మనిషేనా?’ అంటూ ప్రశ్నించారు. కొందరు నాయకులు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించకుండా, కేవలం ప్రజల వ్యక్తిగత విషయాలను, ఫోన్లను దొంగతనంగా వినడానికే పరిమితమయ్యారంటూ విపక్షాలపై మండిపడ్డారు.

 

ఉరిశిక్ష వేసినా తక్కువే!

 

మాజీ సీఎం కేసీఆర్ అహంకారానికి కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా గాయకుడు గద్దరన్నను కేసీఆర్ తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. ‘అహంకారానికి, అహంభావానికి ఒక హద్దుంటుంది. ప్రజల గుండెల్లో నిలిచిన గద్దరన్నను ఎర్రటి ఎండలో నాలుగు గంటల పాటు తన గడీల (ఫామ్‌హౌస్) ముందు నిలబెట్టి అవమానించిన వ్యక్తిని మనం క్షమించాలా? అంతటి మహానుభావుడిని కించపరిచినందుకు కేసీఆర్‌కు ఉరిశిక్ష వేసినా తక్కువే’ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

పశుపతిలా ఫామ్‌హౌస్‌కే పరిమితం

 

కేసీఆర్ ప్రస్తుత పరిస్థితిని రేవంత్ రెడ్డి సినిమా ఉదాహరణతో పోల్చారు. ‘అరుంధతి’ సినిమాలో విలన్ పశుపతిని గొలుసులతో బంధించినట్లుగానే, కేసీఆర్‌ను కూడా ఆయన ఫామ్‌హౌస్‌లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కుతో గొలుసులతో బంధించారని అన్నారు. కేసీఆర్ ఇక అక్కడే కుంగి కృశించి పోవాల్సిందే తప్ప.. మళ్లీ అధికారం అనేది ఆయనకు గతం మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది ఒక కల మాత్రమేనని, ఆ గడీల పాలనకు తెలంగాణలో శాశ్వతంగా తెరపడిందని సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభ సాక్షిగా తేల్చిచెప్పారు.

 

భట్టికి సీఎం రేవంత్ ఆదేశం

 

మిడ్జిల్ సభలో తన పూర్వ రాజకీయ ప్రత్యర్థికి కీలక హామీ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం జెడ్పీటీసీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ గౌస్ రబ్బానీకి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రబ్బానీకి తగిన పదవిని గుర్తించి.. బాధ్యతలు అప్పగించాలని అక్కడికక్కడే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు.