AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!

భారతదేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వాడుతున్నాయి. ‘కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థలోనే AIని ఒక భాగం చేస్తోంది. ఏదో ఒకటి రెండు పథకాలకు మాత్రమే AIని పరిమితం చేయకుండా, సిటిజన్ సర్వీసులు, రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా అనలిటిక్స్, సంక్షేమ పథకాల డెలివరీ వీటన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఒక పెద్ద డిజిటల్ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తయారు చేస్తోంది. కేవలం పనులను డిజిటల్ రూపంలోకి మార్చడమే కాకుండా, రాబోయే సమస్యలను ముందే ఊహించి, సరైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులువుగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

 

నారా లోకేష్ మాట్లాడుతూ..

ఈ మార్పుపై ఆర్టీజీఎస్ (RTGS) మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఏఐ అనేది కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. అది మా ప్రభుత్వ పాలనా వ్యవస్థకు ఒక గుండెకాయ లాంటిదని అన్నారు. కొత్త టెక్నాలజీలను బాధ్యతాయుతంగా వాడుతూ ప్రభుత్వాన్ని మరింత వేగంగా, స్మార్ట్‌గా, పారదర్శకంగా మార్చడమే మా లక్ష్యమని, ప్రజల చుట్టూనే పాలన తిరగాలన్నదే మా పాలసీ అని ఆయన స్పష్టం చేశారు.

 

2025 జనవరిలో..

ఈ డిజిటల్ విప్లవం ‘మన మిత్ర’ అనే వాట్సాప్-ఫస్ట్ సిటిజన్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌తో మొదలైంది. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్, ప్రస్తుతం 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 1,126 రకాల సేవలను అందిస్తోంది. ఇప్పటివరకు 58.2 లక్షల మంది ప్రజలు దీని ద్వారా సేవలు పొందగా, 3.42 కోట్లకు పైగా సర్వీస్ సెషన్స్ రికార్డయ్యాయి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, రకరకాల వెబ్‌సైట్లు వెతుక్కోకుండా, మనకు బాగా అలవాటైన వాట్సాప్‌లోనే పనులన్నీ అయిపోయేలా ఇది ఒకే ఒక డిజిటల్ ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తోంది.

 

ఫిర్యాదులిలా..

ఈ డిజిటల్ విప్లవంలో మరో ముఖ్యమైన అడుగు ప్రజల సమస్యల పరిష్కార వ్యవస్థలో కనిపిస్తుంది. దీనికోసం ప్రభుత్వం AI4PGRS (AI-Powered Public Grievance Redressal System) అనే వ్యవస్థను తెచ్చింది. 2024 జూన్ నుండి పనిచేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు చాట్ చేస్తూ, టెక్స్ట్ మెసేజ్ ద్వారా గానీ, ఫోటోలు పంపించి గానీ, లేదా వాయిస్ మెసేజ్ ద్వారా గానీ తమ ఫిర్యాదులను రిజిస్టర్ చేయవచ్చు. ఇప్పటివరకు దీనికి 17.6 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన సమస్య ఏ శాఖకు వెళ్లాలో రూటింగ్ చేయడం, డేటాను విశ్లేషించడం, ఆఫీసర్లు ఇచ్చే రిప్లై క్వాలిటీగా ఉందో లేదో చెక్ చేయడం మరియు సమస్యలు త్వరగా క్లియర్ కావడానికి స్టాండర్డ్ ప్రొసీజర్లను (SOPs) తయారు చేయడంలో ప్రస్తుతం AI సాయపడుతోంది.

 

ఎమర్జెన్సీ సమయాల్లో..

ఇక ‘అవేర్’ (AWARE) ప్లాట్‌ఫామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సరికొత్త ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 61 రకాల లైవ్ యూస్ కేసెస్‌తో నడుస్తున్న ఈ సిస్టమ్, వాతావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయం, ప్రజారోగ్యం, గాలి నాణ్యత, విపత్తుల సమాచారాన్ని ఒకే చోటికి చేరుస్తుంది. దీనివల్ల ప్రభుత్వం సమస్య వచ్చాక స్పందించడం కాకుండా, రాకముందే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని సేవలు ఏడాది పొడవునా రన్ అవుతుంటే మరికొన్ని మాత్రం వ్యవసాయ సీజన్లలో, వర్షాకాలంలో ఎమర్జెన్సీ సమయాల్లో యాక్టివేట్ అవుతూ అధికారులకు ముందే అలర్ట్స్ మరియు ప్రెడిక్టివ్ ఇంటెలిజెన్స్ అందిస్తాయి.

 

AI తనిఖీల్లో అద్భుతమైన ఫలితాలు

ఈ ప్రజల ప్లాట్‌ఫామ్స్‌కు తోడుగా ‘స్టేట్ డేటా లేక్’ కూడా పనిచేస్తోంది. ఇది ప్రభుత్వంలోని అన్ని శాఖల సమాచారాన్ని ఒకే చోట చేర్చి, రియల్ టైమ్ అనలిటిక్స్ మరియు డేటా ఆధారిత నిర్ణయాలకు సాయపడుతుంది. ఇప్పటివరకు 41 ప్రభుత్వ శాఖలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు చెందిన 55 డేటాబేస్‌లను ఇందులో కలిపారు. ఈ డేటా ఆధారంగా AI జరిపిన తనిఖీల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. దీని ద్వారా 17,547 పెన్షన్ అక్రమాలను కనిపెట్టారు, దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు ₹84.22 కోట్ల డబ్బు ఆదా కానుంది. అలాగే మరణించిన 1.61 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించారు, జగజ్జీవన్ జ్యోతి పథకం కింద అర్హత లేని దాదాపు 96,000 మందిని గుర్తించారు మరియు ఒకే పేరు మీద రెండుసార్లు ఇళ్లు మంజూరైన 1.28 లక్షల కేసులను రివ్యూ కోసం ఫ్లాగ్ చేశారు.

 

క్షయవ్యాధి పై..

ఫీల్డ్‌లో ఉండే అధికారులకు హెల్ప్ అవ్వడానికి ‘AI యాక్సిలరేషన్ ప్రాజెక్ట్’ ద్వారా 98 AI యూస్ కేసెస్‌ను ఐడెంటిఫై చేయగా, అందులో 29 యూస్ కేసెస్ అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ప్రొడక్షన్‌లోకి వచ్చాయి. ఇవి హెల్త్, అగ్రికల్చర్, టాక్సేషన్, సర్వీస్ మరియు పోలీసింగ్ వంటి విభాగాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా క్షయవ్యాధి వచ్చే రిస్క్‌ను ముందే ఊహించడం, పంటల తెగుళ్లను గుర్తించడం, జీఎస్టీ మోసాలను పట్టుకోవడం, సీసీటీవీ కెమెరా అనలిటిక్స్ వంటి వాటిల్లో AI సాయం తీసుకుంటున్నారు.

 

ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్..

అలాగే అధికారుల నిర్ణయాల కోసం RTGS లెన్స్, రెవెన్యూ వన్, సింగిల్ సెర్చ్ బార్ వంటి ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్ తెచ్చారు. ఇందులో RTGS లెన్స్ 28 శాఖలకు చెందిన 506 డిపార్ట్‌మెంటల్ వర్క్‌ఫ్లోలను కలిపి, అధికారులకు రియల్ టైమ్ డ్యాష్‌బోర్డులను అందిస్తోంది. రెవెన్యూ వన్ భూమి మరియు రెవెన్యూ రికార్డులను డిజిటల్ చేస్తుండగా, ప్రస్తుతం 19,000 మందికి పైగా రెవెన్యూ అధికారులు దీన్ని వాడుతున్నారు. అలాగే ప్రభుత్వ సమాచారం కోసం ఆఫీసర్లు వెతుక్కునేలా తెచ్చిన AI సెర్చ్ బార్ ద్వారా ఇప్పటివరకు 1.8 లక్షలకు పైగా ప్రశ్నలు సాల్వ్ అయ్యాయి.

 

ప్రిసిషన్ గవర్నెన్స్..?

ఏపీ ప్రభుత్వం తదుపరి లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే, సంక్షేమ పథకాలను ఒక వ్యక్తికి కాకుండా ‘కుటుంబాన్ని’ ఒక యూనిట్‌గా తీసుకుని అందించడం, దీనినే ప్రిసిషన్ గవర్నెన్స్ అంటారు. దీనికోసం FBMS (Family Benefit Management System) ను తీసుకురాబోతున్నారు. అన్ని శాఖల్లోని డేటాను కలిపి ఒకే ఒక ‘యూనిఫైడ్ ఫ్యామిలీ డేటాబేస్’ తయారు చేసి, కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను బట్టి AI ద్వారా ఒక ‘వల్నరబిలిటీ స్కోర్’ ఇస్తారు. దీనివల్ల నిజమైన అర్హులకు పథకాలు అందుతాయి.

 

దేశంలోనే ఒక మోడల్‌..

రాబోయే మూడేళ్ల రోడ్‌మ్యాప్‌లో అన్ని శాఖలకూ AIని విస్తరించడం, AI లివింగ్ ల్యాబ్స్’ ప్రారంభించడం, స్టేట్ డేటా లేక్‌ను మరింత పెద్దది చేయడం, ప్రజలందరి కోసం ఒకే ప్లాట్‌ఫామ్ గా ‘AP One’ ను లాంచ్ చేయడం వంటి లక్ష్యాలను పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే, కేవలం కంప్యూటర్లలో రికార్డులు దాచడమే కాకుండా, టెక్నాలజీతో ప్రభుత్వ తీరునే ఎలా మార్చవచ్చో చూపించడానికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక మోడల్‌గా నిలుస్తుంది.