బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 1,400 కోట్ల నిధులు స్వచ్ఛమైనవి కావని అన్నారు. అవన్నీ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవేనని ఆరోపించారు. ఆ నిధులపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, ఆ డబ్బును తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు పంచాలి అని డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా చేపట్టిన ‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా తాను క్షేత్రస్థాయిలో కార్మికులతో మమేకమవుతున్నట్లు కవిత తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, చెల్లించాల్సిన బకాయిల కారణంగా సింగరేణి సంస్థపై పెను భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందంటే… కనీసం కార్మికులకు అవసరమైన పనిముట్లు (మైనింగ్ పరికరాలు) కూడా కొనలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. “ఇక్కడ అధికారులకు ఓ రూల్… రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులకు మరో రూల్లా యాజమాన్యం వ్యవహరిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ వైఖరి వల్ల తెలంగాణ హక్కుగా ఉన్న బొగ్గు బ్లాక్లు ప్రైవేట్పరం అవుతున్నాయని కవిత విమర్శించారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో 62 వేల మంది రెగ్యులర్ కార్మికులు ఉండగా, నేడు ఆ సంఖ్య 38 వేలకు పడిపోయిందని గుర్తుచేశారు. కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
“కార్మికుల వారసత్వ (డిపెండెంట్) ఉద్యోగాల కోసం నెలలో కనీసం రెండు సార్లు మెడికల్ బోర్డ్ నిర్వహించాలి. ఒకవేళ ప్రభుత్వం, యాజమాన్యం డిపెండెంట్ ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వకపోతే.. ఈనెల 20 నుంచి రామగుండం వేదికగా నిరవధిక దీక్ష చేపడతాం” అని స్పష్టం చేశారు.

