NationalTELANGANA

వచ్చేస్తోంది బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్‌కు 3 కొత్త కారిడార్లు..!

భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్‌) కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి సర్వీసును నడపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గం దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గంగా నిలవనుంది.

 

508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌ను దశలవారీగా ప్రారంభిస్తారు. సూరత్-బిలిమోరా సెక్షన్ ప్రారంభమైన తర్వాత, మిగిలిన మార్గాలైన వాపి-సూరత్, వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే, చివరగా పూర్తిస్థాయిలో అహ్మదాబాద్-ముంబై మార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులు ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునేందుకు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు రెండు ఆర్థిక రాజధానుల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా, కారిడార్ వెంబడి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

 

ఈ సందర్భంగా దేశంలో హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలను కూడా వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మూడు కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. పుణె-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దక్షిణాది రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచుతాయి. వీటితో పాటు హైదరాబాద్-ముంబై మధ్య కూడా మరో హై-స్పీడ్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ నగరానికి మూడు హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను కేటాయించారు. ఇవి నగరం రూపురేఖలను పూర్తిగా మారుస్తాయి” అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ నెట్‌వర్క్ తెలంగాణలోని అనేక జిల్లాల మీదుగా ప్రయాణిస్తూ, రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని తెలిపారు.

 

ఇదే సమయంలో ‘నవ్-నిర్మాణ్’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ వంటి కీలక స్టేషన్లను ఈ పథకం కింద ఆధునికీక‌రిస్తున్నట్లు ఆయన వివరించారు.