కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించినప్పుడే వారి నుంచి మెరుగైన ఉత్పాదకతను సాధించగలమని తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు సామాజిక భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం హైదరాబాద్లోని మారియట్ హోటల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ – 2026 ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ ప్రసంగించారు. జులై 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 14 దేశాల నుంచి దాదాపు 110 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో భారత్లో సుమారు 17 కోట్ల ఉద్యోగాలను సృష్టించామని, 2017లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2025 నాటికి 3.1 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఇదే సమయంలో మహిళ ఉపాధి రేటు 22 శాతం నుంచి 38.8 శాతానికి వృద్ధి చెందిందని వివరించారు.
రాబోయే రెండేళ్లలో వ్యవస్థీకృత రంగంలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ను ప్రవేశపెట్టినట్లు మాండవీయ తెలిపారు.
మరోవైపు, తెలంగాణలో యువతకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని మంత్రి వివేక్ వెల్లడించారు. టామ్కామ్ ద్వారా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన వివరించారు.

