నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు. ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేష్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు బొచ్చు నాగేశ్వరరావు సహకారంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష తదితరుల సహకారంతో బాధిత కుటుంబానికి ఒక బియ్యపు బస్తా, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, రూ.5,000 నగదు అందజేశారు. మృతుడు మణికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.
కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష, పిల్లలు ఇంటర్మీడియట్ చదువులోకి వచ్చినప్పుడు వారికి ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారే వెంకటేశ్వర్లు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

