National

గెలుపు తర్వాత నియోజకవర్గ యువతకు ప్రశాంత్‌ కిశోర్‌ తొలి హామీ ఇదే..

బాంకీపూర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.

బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని తాను హామీ ఇవ్వడం లేదని చెప్పారు. అయితే తన పరిచయాలు, నెట్‌వర్క్‌ను ఉపయోగించి దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తానని తెలిపారు.

బిహార్‌లో జనసురాజ్‌ వ్యవస్థ బలపడిన తర్వాత ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. నియోజకవర్గంలో పిల్లల విద్యకు పునాది వేసే చర్యలు చేపడతానని చెప్పారు. నిలిచిపోయిన వృద్ధాప్య పింఛన్లు, రేషన్‌ కార్డుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రేషన్‌ కార్డు కోసం లంచం అడిగే పరిస్థితి లేకుండా చేస్తానని చెప్పారు. ఇందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. రేషన్‌ కార్డు ఉన్నవారికి ప్రస్తుతం అందుతున్న నాలుగు కిలోల ధాన్యాన్ని ఐదు కిలోలకు పెంచుతామని తెలిపారు. వృద్ధుల పింఛన్‌ సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితాలతో బిహార్‌ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోందని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ‘ఎన్‌కౌంటర్ల’ గురించి కాకుండా విద్య, ఉపాధి గురించి చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ఓటుకున్న శక్తి అని పేర్కొన్నారు.