AP

విజయవాడలో డీఎస్సీ టీచర్ల ‘ఆత్మగౌరవ ర్యాలీ’.. వైసీపీపై ఫైర్..

తమ నియామకాలపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఆదివారం విజయవాడలో భారీ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న ఆరోపణలు వెంటనే ఆపకపోతే వైసీపీని ప్రకాశం బ్యారేజీలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి సుమారు 7,000 మందికి పైగా నూతన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శన, అంబేద్కర్ స్మృతివనం వరకు కొనసాగింది. “వైసీపీ విష ప్రచారం నశించాలి”, “టీచర్ల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు” అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు సాధించామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగం సాధించామన్న కనీస సంతోషాన్ని వైసీపీ నేతలు తమ విష ప్రచారంతో దూరం చేస్తున్నారని వాపోయారు. తమ ప్రతిభను శంకించి, నియామకాలపై బురద జల్లడం వల్ల తాము, తమ కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నామని తెలిపారు.

ఇప్పటికే కర్నూలు, తిరుపతితో పాటు పలు జిల్లాల్లో ఇలాంటి నిరసన ర్యాలీలు నిర్వహించామని, అయినా వైసీపీ నేతల తీరు మారకపోవడం దారుణమన్నారు. తమపై విమర్శలు చేస్తున్న వారికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి తమ నిరసనను నిర్వహించారు. తమపై విష ప్రచారం తక్షణమే ఆపాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.