National

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు..

ప్రధాని మోదీ ముంబయి పర్యటన వేళ.. అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఉన్న నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) వద్ద మోదీ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా.. ఇద్దరు అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు.

ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరిని 24 ఏళ్ల రోహన్ పారేఖ్‌గా గుర్తించారు. సదరు వ్యక్తి తనను తాను ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ (PMO) అధికారినని చెప్పుకున్నాడు. అయితే పోలీసులు అతడి గుర్తింపు కార్డును క్షుణ్ణంగా తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది. వీరి వద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ పేరిట తయారు చేసిన నకిలీ ఐడీ కార్డులు ఉన్నట్లు విచారణలో స్పష్టమైంది.

రోహన్ పారేఖ్‌తో పాటు అదుపులోకి తీసుకున్న మరో వ్యక్తి అతడికి రక్షణగా ఉన్న బాడీగార్డ్ అని ముంబయి పోలీసులు తెలిపారు. సదరు బాడీగార్డ్ వద్ద ఒక తుపాకీ (ఫైర్ ఆర్మ్) లభ్యమైందన్నారు. నిందితులు నకిలీ ప్రభుత్వ ఐడీ కార్డును చూపిస్తూ వరల్డ్ ప్లాజా మాల్‌లోకి బలవంతంగా ప్రవేశించడానికి యత్నించారని పేర్కొన్నారు. అయితే స్వాధీనం చేసుకున్న ఆయుధానికి లైసెన్స్ ఉన్నప్పటికీ నకిలీ గుర్తింపు కార్డులు వాడటంతో వెంటనే వారిని అరెస్ట్ చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.

మరోవైపు ఘటనపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ ప్రారంభించారు. నకిలీ ఐడీ కార్డులతో, ఆయుధంతో వేదిక ప్రాంగణంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే కోణంలో ఇద్దరినీ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల ఫోన్లు, గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు.

ఇదిలాఉంటే ముంబయి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సాంకేతిక సదస్సులలో ఒకటైన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (GFF) 2026’ ను ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ‘పొటెన్షియల్ టూ ఇంపాక్ట్: ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ – ట్రస్టెడ్, కనెక్టెడ్, గ్లోబల్ సిస్టమ్స్ ఫర్ ఇన్‌క్లూసివ్ ఫైనాన్స్’ అనే ఇతివృత్తంతో (థీమ్‌) నిర్వహిస్తున్నారు.