National

“బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?”.. మీడియాపై పినరయి విజయన్ ఫైర్..

కేరళ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి మీడియా ప్రతినిధులపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు గురించి మీడియా వెంటపడడంతో సహనం కోల్పోయారు. “నాతో పాటు బాత్రూమ్‌లోకి కూడా వస్తారా?” అని వారిపై విరుచుకుపడ్డారు.

వివరాల్లోకి వెళితే… బుధవారం చంగనచేరికి వెళుతుండగా మార్గమధ్యంలో విజయన్ మధ్యాహ్నం కల్లిస్సేరిలోని పీడబ్ల్యూడీ రెస్ట్ హౌస్‌లో ఆగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులు, ఆయన కారు దిగగానే చుట్టుముట్టి ఈడీ కేసు గురించి ప్రశ్నలు సంధించారు. అయితే విజయన్ మౌనంగా రెస్ట్ హౌస్‌లోకి నడిచారు. విలేకరులు ఆయన్ను అనుసరిస్తూ లోపలికి వెళ్లి మళ్లీ అవే ప్రశ్నలు అడిగారు.

ఒక గదిలోకి వెళ్లే ముందు, వెనక్కి తిరిగిన విజయన్ తీవ్ర అసహనంతో.. “నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని కలవడానికి కాదు” అని చెబుతూ, “నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తారా… బాత్రూంలోకి వెళ్లినా వదలరా?” వ్యాఖ్యానించారు. అనంతరం గదిలోకి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చి మౌనంగానే తన వాహనంలో చంగనచేరికి వెళ్లిపోయారు.

పినరయి విజయన్, ఆయన కుమార్తె టి. వీణ, అల్లుడు, ఎమ్మెల్యే పి.ఎ. మహమ్మద్ రియాస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ ఈడీ ఇటీవల రాష్ట్ర పోలీస్ చీఫ్‌కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 66(2) ప్రకారం ఈడీ తన దర్యాప్తు వివరాలను, ఆధారాలను పోలీసులకు పంపింది. ఈ నేపథ్యంలో మీడియా ఆయన్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఈ ఘటన చోటుచేసుకుంది.

విజయన్ మీడియా పట్ల ఇలా కఠినంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వారపు కేబినెట్ అనంతర మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. 2017లో తిరువనంతపురంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సమావేశానికి వెళ్లినప్పుడు మీడియా ప్రతినిధులను ‘బయటకు వెళ్లండి’ అంటూ గట్టిగా మందలించిన ఘటన అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి ఆయన తన పాత పంథానే కొనసాగించారు.