స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ నాయకత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక పోరులో అనుసరించాల్సిన విధివిధానాలు, వ్యూహాలను రూపొందించేందుకు.. పార్టీ ఇప్పటికే సమన్వయ కమిటీని వేసింది. ప్రస్తుతానికి.. 14 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో.. సన్నాహక సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. లోకల్ పోరులో అనుసరించాల్సిన ప్రణాళికలపై నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జనసైనికులు, వీర మహిళలను సమాయత్తం చేయడంతో పాటు కూటమి పార్టీలతో సమన్వయం ఎలా ఉండాలనే దానిపై స్పష్టత ఇస్తున్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణను శ్రేణులకు వివరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాయకులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లేలా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఈ రివ్యూలు.. కేడర్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఈ గ్రౌండ్ లెవెల్ వ్యూహాలు జనసేనకు ఏ స్థాయిలో విజయాలను అందిస్తాయనేది చూడాలి.

