National

పహల్గాం దాడిపై బ్రిక్స్ దేశాల తీవ్ర ఖండన.. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్..

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాలు ఉగ్రవాదంపై కీలక తీర్మానం చేశాయి. 2025లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం ‘ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం’ అనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. ఈ మేరకు సెప్టెంబర్ 12న ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’లో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశాయి.

2025 ఏప్రిల్ 22న పహల్గాంపై జరిగిన ఉగ్రదాడిని అత్యంత కఠిన పదజాలంతో ఖండిస్తున్నట్లు బ్రిక్స్ నేతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఏ కారణంతో చేపట్టినా అవి నేరపూరితమైనవేనని, ఏమాత్రం సమర్థనీయం కావని తేల్చిచెప్పారు. సరిహద్దులు దాటి సాగే ఉగ్రవాదుల కదలికలు, ఉగ్రవాదానికి నిధులు సరఫరా, వారికి సురక్షిత ఆశ్రయాలు కల్పించడం వంటి అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడతామని బ్రిక్స్ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.

ఉగ్రవాద నిరోధక చర్యల్లో ద్వంద్వ ప్రమాణాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఏ మతానికీ, జాతీయతకూ, నాగరికతకూ లేదా నిర్దిష్ట జాతి సమూహానికీ ముడిపెట్టకూడదని నేతలు పిలుపునిచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని జాతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యులను చేసి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరారు. ముఖ్యంగా యువతలో పొంచి ఉన్న తీవ్రవాదాన్ని, రాడికలైజేషన్‌ను ఎదుర్కోవడానికి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నొక్కిచెప్పారు.

అయితే, ఈ దాడి వెనుక ఏ దేశపు మద్దతు ఉందనే విషయాన్ని ఈ డిక్లరేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో 2025 బ్రిక్స్ రియో డిక్లరేషన్‌లోనూ, టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సులోనూ పహల్గాం ఘటనపై ఇదే తరహాలో ఖండన తీర్మానాలు వెలువడటం గమనార్హం.