National

మెడికల్‌ షాపుల్లో సీసీటీవీ నిఘాలోనే మందులు.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు..

డాక్టర్ల సిఫార్సుతో విక్రయించే మందులపై కేంద్రం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. మందుల దుకాణాలు, ఇతర లైసెన్స్‌ పొందిన రిటైల్‌ కేంద్రాల్లో ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా మందులు విక్రయించే సమయంలో సీసీ కెమెరా నిఘా తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీసుకొచ్చింది.

సెప్టెంబర్‌ 8న జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం.. రిజిస్టర్డ్‌ వైద్యుడు సూచించిన ఏదైనా మందును హోల్‌సేల్‌ విక్రయాలు మినహా ఇతర మార్గాల్లో సరఫరా చేసే సమయంలో లైసెన్స్‌ పొందిన ప్రాంగణంలో సీసీటీవీ వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి. మందు విక్రయం జరిగిందని ధ్రువీకరించుకునేలా రికార్డింగ్‌ ఉండాలి. ఈ దృశ్యాలను కనీసం మూడు నెలల పాటు భద్రపరచాలని ప్రతిపాదించారు.

ప్రిస్క్రిప్షన్‌ అవసరమైన మందులను కొన్ని చోట్ల సరైన వైద్య సూచన లేకుండానే విక్రయిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. మందుల విక్రయంలో బాధ్యతను పెంచడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులు తనిఖీ చేసేందుకు ఈ రికార్డులు ఉపయోగపడే అవకాశం ఉంది.

ఈ నిబంధన షెడ్యూల్‌ హెచ్‌, హెచ్‌1, ఎక్స్‌ మందులకే పరిమితం కాదు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌తో సరఫరా చేసే మందులన్నింటికీ వర్తించేలా ముసాయిదాలో పేర్కొన్నారు. అయితే హోల్‌సేల్‌ వ్యాపారులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇటీవల దగ్గు సిరప్‌ల విక్రయాలపై నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో తాజా ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలకు ఉద్దేశించిన కొన్ని మందులు సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా ఇవ్వడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వయసు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందు, మోతాదు నిర్ణయించాల్సిన అవసరం ఉండటంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది.

అయితే సీసీటీవీ నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. ఇది కేవలం ముసాయిదా మాత్రమే. ప్రతిపాదనపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. గెజిట్‌లో తుది నిబంధనలు ప్రచురించినప్పుడు ప్రభుత్వం పేర్కొనే తేదీ నుంచి మాత్రమే కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది