తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. అలాగే.. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకకుంది.
ఇప్పటికే జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు.. త్వరలో జరుగనున్న జూనియర్ లెక్చరర్ల పరీక్షలు వాయిదా వేసింది. నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్లో వేర్వేరు ప్రశ్నాపత్రాలను గుర్తించారు దర్యాప్తు అధికారులు. కాగా, ప్రవీణ్.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి నాలుగు ఎగ్జామ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. రానున్న 3, 4 నెలల్లో 20కి పైగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ తరుణంలో పేపర్లు లీక్ అవడంతో.. అన్ని ప్రశ్న పత్రాలను మార్చాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది..