AP

ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకంలో రాగి జావా…

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మెనులో మరో పోషకాహారం అందించనున్నారు.

 

44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు రాగిజావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రూ. 86 కోట్ల అదనపు వ్యయంతో చేపడుతోన్న ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో సమూల మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది.

 

ఇక తాజాగా జోడించిన రాగిజావాను వారానికి మూడు రోజులు అందించనున్నారు. మిగిలిన మూడు రోజుల్లో చిక్కీ ఇవ్వనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి 15 రకాలు, ఐదు రోజుల పాటు- గుడ్డు, 3 రోజులు చిక్కీ, ఇకపై 3 రోజులు రాగిజావ కూడా ఇవ్వనున్నారు. ఇక జగనన్న గోరు ముద్ద పథకానికి ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.1824 కోట్లు ఖర్చు చేస్తుంది. రాగి జావ కూడా జగనన్న గోరుముద్ద పథకంలో చేరడంతో మరో రూ. 86 కోట్లతో కలిపి మొత్తం జగనన్న గోరుముద్ద పథకం రూ.1910 కోట్లకు చేరుకుంది.