AP

తొలిసారిగా ఆయన డైరెక్షన్ లో ప్రభాస్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూస్తోన్న కాంబినేషన్ ఒకటి ఉంది. అదే.. రెబల్ స్టార్ ప్రభాస్-లెక్కల మాస్టర్ సుకుమార్. రంగస్థలం, పుష్ప సినిమాలతో సుకుమార్ తన పరిధిని, ఇమేజ్ ను పెంచుకున్నారు.

మరోవైపు ప్రభాస్ జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి కథానాయకుడిగా మారిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

పుష్ప2 చిత్రం తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని సుకుమార్ భావిస్తున్నారు. అయితే లైగర్ పరాజయం ఈ సినిమాపై ప్రభావాన్ని చూపించబోతోందని అర్థమవుతోంది. ఆ సినిమా వస్తుందా? రాదా? అనే అనుమానంలో పడింది. విజయ్ దేవరకొండ సినిమా లేకపోతే ప్రభాస్ తో సినిమా తీయడానికి ఏర్పాట్లు చేసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ కోసం సుక్కు స్టోరీ లైన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

రంగస్థలం, పుష్పకు భిన్నంగా సుకుమార్ ఓ పిరియాడికల్ స్టోరీని ఫిక్స్ చేశారు. రజాకారుల ఉద్యమ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ కథ ప్రభాస్ కి కూడా వినిపించారు. పుష్ప మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య వచ్చిన గ్యాప్ లో సుకుమార్ ఈ కథపై పూర్తిస్థాయిలో వర్క్ చేశారు. పుష్ప2 షూటింగ్ పూర్తయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సుకుమార్ భావిస్తున్నారు.

ప్రభాస్ వరుస సినిమలతో బిజీగా ఉన్నారు. సలార్ పూర్తి కావస్తోంది. ఆ సినిమా తర్వాత స్పిరిట్ చేయబోతున్నాడు. మరోవైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ జరుగుతోంది. ఒకేసారి మూడు సినిమాల్ని ప్రభాస్ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆదిపురుష్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. స్పిరిట్ తోపాటు సుకుమార్ సినిమాను కూడా సమాంతరంగా షూటింగ్ జరిపి పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అంటేనే అభిమానుల ఆనందానికి హద్దల్లేకుండా ఉంది.