NationalPOLITICS

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరు

ర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి క్రిమినల్ హిస్టరీని దాచి పెట్టి వారికి మద్దతుగా అగ్రనాయకులు ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాలు, బియ్యం దొంగతనం కేసులో శిక్ష పడ్డ ఓ బీజేపీ అభ్యర్థి తరపున ఈ రోజు ప్రధాని మోడీ ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే హఠాత్తుగా ఆ సభను పార్టీ రద్దు చేసుకుంది.

కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మణికాంత్ రాథోడ్ తరపున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించాల్సిన బహిరంగ సభ రద్దయ్యింది..మణికాంత్ రాథోడ్ పై హత్యాయత్నం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, తుపాకీలను కలిగి ఉండటం, నేరపూరిత బెదిరింపు వంటి అభియోగాలతో సహా 43 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాథోడ్ నేర నేపథ్యం గురించి ఆందోళనలు, నిరసనలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బదులుగా మే 6, శనివారం, మే 7 ఆదివారం బెంగళూరులో మోడీ భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు.

గత ఏడాది నవంబర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గేను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడినందుకు గానూ మణికాంత్ రాథోడ్‌ అరెస్టయ్యాడు. అయితే ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.

గత ఏడాది సెప్టెంబర్‌లో మణికాంత్‌ను ఏడాది పాటు శివమొగ్గ రూరల్ పోలీస్ లిమిట్స్ నుంచి పోలీసు కమిషనర్ వై.ఎస్.రవికుమార్ బహిష్కరిం చారు, అయితే అతను దీనిపై కోర్టు నుండి స్టే ఆర్డర్‌ను పొందాడు. ‘అన్న భాగ్య’ పథకం కింద ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించిన బియ్యం, పాలను అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన కేసులు కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఇతనిపై నమోదయ్యాయి. బ్లాక్ మార్కెట్‌లో విక్రయించేందుకు అంగన్‌వాడీల నుంచి పాలను దొంగిలించిన మూడు కేసుల్లో మణికాంత్ రాథోడ్ కు శిక్ష పడింది.