ప్రైమరీ ఎడ్యుకేషన్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలో నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా 5, 8 తరగతులకు మాత్రమే. పై తరగతులకు వెళ్లే ముందు కచ్చితంగా ఈ రెండు క్లాసుల్లో విజయం సాధించాలి. దీంతో విద్యార్థులు పాసయ్యే భారం ఇకపై ఉపాధ్యాయులపై పడనుంది.
పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. నో-డిటెన్షన్ విధానం రద్దు చేసింది. తొలి విడతగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో నో- డిటెన్షన్ విధానం రద్దు చేసింది. ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి ఉంటుంది.
విద్యాహక్కు చట్టం- 2019 సవరణ చేసింది కేంద్రప్రభుత్వం. దాని ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని వెల్లడించింది. పరీక్షల్లో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాసేందుకు రెండు నెలల సమయం కేటాయించింది.
రీ-ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లో చదవాల్సి ఉంటుంది. ఎలిమెంటరీ విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదన్నది మరో కీలక పాయింట్. తీసుకొచ్చిన కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కొత్త విద్యా విధానం ప్రకారం మిగతా పాఠశాలలకు వర్తింపనుంది. చాలా రాష్ట్రాలు కొత్తగా సీబీఎస్ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయనే చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే భారమంతా టీచర్లపై ఉంటుందన్నమాట.
ఇప్పటివరకు పరీక్షల్లో పాసైనా, ఫెయిల్ అయినా హాజరు శాతంతో పై తరగతులకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ పద్దతి పోనుంది. సీబీఎస్ఈ స్కూళ్లయితే కొత్త విధానం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలో అంశం కావడంతో దీనిపై ఆయా రాష్ట్రాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి.