రాష్ట్ర మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ కొన్ని రోజుల క్రితం విడుదలైన మావోయిస్టుల లేఖ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ లేఖను తాము విడుదల చేయలేదని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది.
వారం క్రితం మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారమైంది. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఈ లేఖపై మొదటి నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో మావోయిస్టు పార్టీయే దీనిపై స్పష్టత ఇచ్చింది.
సీతక్కను ఉద్దేశించి తాము ఎలాంటి లేఖ రాయలేదని తేల్చిచెబుతూ మావోయిస్టు పార్టీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు పార్టీయే స్వయంగా ఖండించడంతో ఆ మొదటి లేఖను ఎవరు సృష్టించారు? వారి ఉద్దేశం ఏంటి? అనే దానిపై చర్చ జరుగుతోంది.