ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.
ఏపీలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం..
అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మాండవీయ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సమావేశంలో వివరించారు. ఇప్పటికే క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను పంపినట్టు చంద్రబాబు తెలిపారు.
ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలన్న సీఎం
అలాగే నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు సీఎం వెల్లడించారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి 341 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని చంద్రబాబు కోరారు.
శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలన్న చంద్రబాబు
జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించించారు.
రూ.25 కోట్లు విడుదల చేయాలని వినతి
ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు కేంద్రమంత్రి మాండవీయకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు కోరారు.