విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన గాదె రేణుక ఒకప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ నెలకు లక్షల్లో జీతం అందుకునేది. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమె నేర బాట పట్టింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న రేణుక, క్రమంగా తాను కూడా ఈ అక్రమ వ్యాపారంలోకి దిగి ‘లేడీ డాన్’గా ఎదిగింది. తాజాగా నర్సీపట్నం నుంచి శ్రీలంకకు గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను, ఆమె ముఠాను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, రేణుక కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు గంజాయిని పంపేందుకు ఆమె మాస్టర్ ప్లాన్ రచించేది. ఈ క్రమంలోనే సుమారు 18 లక్షల రూపాయల విలువైన 74 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. రేణుక గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన నేరస్తురాలని, గతంలో ఆమె ఇలా గంజాయి రవాణా చేస్తూ నాలుగు సార్లు పోలీసులకు పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.
బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రతిసారీ తన పంథాను మార్చుకోకుండా రేణుక మరింత వేగంగా స్మగ్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. పోలీసులు నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఆమెతో పాటు మరో నలుగురు ముఠా సభ్యులను కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన యువత, ఇలా అక్రమ మార్గాల వైపు మళ్లి జీవితాలను నాశనం చేసుకోవడం పట్ల జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముఠా వెనుక ఉన్న ఇతర పెద్దల హస్తంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

