TELANGANA

ఒవైసీకి బండి సంజయ్ సవాల్…..

భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు, కనీసం బురఖా ధరించిన మహిళను మీ పార్టీకి (AIMIM) అధ్యక్షురాలిని చేసే ధైర్యం మీకుందా అని ఆయన ప్రశ్నించారు. కేవలం మాటల్లో మహిళా సాధికారత అని చెప్పడం కాదు, చేతల్లో చూపాలని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సవాల్ విసిరారు.

ముస్లిం మహిళల ప్రాతినిధ్యంపై ఒవైసీని నిలదీస్తూ, ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ తరఫున ముస్లిం మహిళ షాజాదీ సయ్యద్‌ను పోటీకి నిలబెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఒవైసీ, నిజానికి తన పార్టీలోనూ, బయటా మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రక నిర్ణయాల ద్వారా ముస్లిం మహిళలకు నిజమైన న్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గ్యాస్ కనెక్షన్లు, గృహ నిర్మాణ పథకాలు ముస్లిం సోదరీమణులకు ఎంతో మేలు చేశాయని, అందుకే వారు మోదీని తమ అన్నయ్యగా భావిస్తున్నారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఒవైసీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.