National

రాఘవ్ చద్దాకు షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు..!

రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తే ఒక కీలక నేతను పార్టీ పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కాక విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ గొంతుకగా పేరుగాంచిన ఎంపీ రాఘవ్ చద్దాకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పార్టీ రాజ్యసభ పక్ష ఉప నాయకుడి బాధ్యతల నుండి ఆయనను తప్పించాలని కోరుతూ రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన మరో ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించాలని ఆప్ ప్రతిపాదించింది. అశోక్ మిట్టల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) వ్యవస్థాపకుడిగా అందరికీ సుపరిచితులు. అయితే కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా.. సభలో పార్టీకి కేటాయించే సమయంలో చద్దాను మాట్లాడనివ్వవద్దని (No speaking time) కూడా పార్టీ కోరినట్లు సమాచారం అందుతోంది. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

 

గత కొంతకాలంగా రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలు సామాన్యులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టెలికామ్ కంపెనీలు చేస్తున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ మోసం గురించి ఆయన మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు, సామాన్యులపై బ్యాంకులు విధిస్తున్న పెనాల్టీల వంటి అంశాలపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా నిలదీశారు. విమానాశ్రయాల్లో సామాన్యులకు భారంగా మారిన ఆహార ధరల పైన కూడా ఆయన గళమెత్తారు. ఆహార కల్తీ వంటి కీలక విషయాల్లో ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలని ఆయన పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేశారు.

 

ఇంతటి ప్రజాదరణ పొందుతున్న నేతను పార్టీ ఎందుకు దూరం పెడుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా రాఘవ్ చద్దా పేరు కనుమరుగైంది. పార్టీ అంతర్గత విభేదాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా లేక రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారా అనే కోణంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చురుగ్గా ఉండే ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయడం అనేది పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గినట్లు సంకేతాలిస్తోంది.

 

రాఘవ్ చద్దా కేవలం రాజకీయ నేతగానే కాకుండా యువతలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. సామాన్యుడి కష్టాలను పార్లమెంట్ వేదికగా ప్రతిబింబించడంలో ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు. అలాంటి వ్యక్తిపై పార్టీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అధిష్టానం ఈ మార్పులను కేవలం పాలనాపరమైనవిగా పేర్కొంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అసంతృప్తి జ్వాలలు కనిపిస్తున్నాయి.