జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయనే వాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంశంతో భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు. ఇది శబరిమలకు ప్రత్యేక అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.
దీని ద్వారా స్థానిక వ్యాపారాలు ఊపందుకుంటాయని, యువతకు కొత్త ఉపాధి మార్గాలు వస్తాయని ఆయన అన్నారు. ఇలాంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసిందని విమర్శించారు. కేరళలో బీజేపీ గెలిస్తే, డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుందని, అప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ అన్నారు.

