TELANGANA

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం..

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి హైదరాబాద్ సిటీవాసులకు ఉచితంగా MMTS సేవలు అందించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.

 

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వేశాఖతో మంతనాలు

 

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది రేవంత్‌రెడ్డి సర్కార్. ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రైల్వేశాఖతో చర్చలు జరుగుతున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ రెండు అనగా తెలంగాణ ఆవిర్భావం రోజు అమలు చేయాలని ఆలోచన చేస్తోంది.

 

ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ప్రయాణికుల టికెట్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిసైడ్ అయ్యింది. దీనిపై ఏప్రిల్ 16న ఉన్నతస్థాయి సమావేశంలో చర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత అధికారికంగా దక్షిణ మధ్య రైల్వేకు తీసుకున్న ప్రతిపాదనలను పంపింది.

 

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం, జూన్ 2 నుంచి అమలు!

 

ఈ ప్రతిపాదనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే.. అమలుకు సంబంధించి ముసాయిదా పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా-పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌రంజన్‌ రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ముసాయిదాను పరిశీలించి అనుమతి కోసం రైల్వే బోర్డుకు పంపిస్తామన్నారు.

 

రైళ్ల సంఖ్య, సమయం, స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలను రైల్వేబోర్డు నిబంధనల ప్రకారం నిర్ణయిస్తామని చెబుతోంది. ఇదే సమయంలో ఎంఎంటీఎస్‌-2వ దశ నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది రైల్వే శాఖ. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వస్తే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, ప్రజలను భారీ ఊరట రానుంది.