Uncategorized

కేసీఆర్ సంచలన ప్రకటన..! బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం…

జగిత్యాల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో అమలవుతున్న హైడ్రా (HYDRAA) కూల్చివేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హైడ్రాను ఎత్తి అవతల పారేస్తామని ప్రకటించారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని, చదువుకునే పిల్లల పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడం ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. “రైతు బంధు” పథకం బీఆర్ఎస్ హయాంలో పది రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేదని, ఇప్పుడు రైతులు పైసల కోసం ఆకాశం వైపు చూడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా బస్తాల కోసం మళ్లీ పాత రోజుల్లాగా పోలీస్ స్టేషన్ల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది అత్యంత అసమర్థ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు.

 

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో ఉండేదని, తలసరి ఆదాయం నుండి జిఎస్డిపి వరకు దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ నేడు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని, భూముల ధరలు దారుణంగా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పల్లె ప్రగతి ద్వారా బాగుపడ్డ గ్రామాలు ఇప్పుడు నిధులు లేక, ట్రాక్టర్లకు డీజిల్ పోసే దిక్కు లేక మురికికూపాలుగా మారుతున్నాయని విమర్శించారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం అరాచకాలు, దోపిడీలే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.

 

ఉద్యోగులకు తాము 72 శాతం వరకు పీఆర్సీ ఇచ్చామని, నేడు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు, ఆటో కార్మికులకు ఉచిత బస్సు పథకం వల్ల ఆదాయం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. విదేశీ విద్య కోసం ఇచ్చే అంబేద్కర్, జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు.

 

ప్రధాని మోదీ ఒత్తిడి చేసినా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని, దాని కోసం రూ. 30 వేల కోట్ల ఆదాయాన్ని కూడా వదులుకున్నానని కేసీఆర్ వెల్లడించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఢిల్లీలో లొంగిపోయి మీటర్లు పెట్టడానికి సంతకాలు పెట్టిందని, దీనిపై రైతులు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

 

సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయన కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన నేత కాదని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం ఆయన ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పోవాలి – కేసీఆర్ రావాలి” అనే నినాదం ప్రజల గుండెల్లో నుండి వస్తోందని, మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాల్సిందేనని ఉద్ఘాటించారు. జగిత్యాల జైత్రయాత్రే మళ్లీ పార్టీ విజయానికి నాంది పలుకుతుందని, ప్రతి కార్యకర్త ఆ దిశగా కదలాలని పిలుపునిచ్చారు.