తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు.
ఈ నెల 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సభలో పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా వెల్లడించారు. అయితే, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు ఆమోదం తెలిపింది.
ఈ పేరును కవితకు కేటాయిస్తున్నట్లు ధృవీకరిస్తూ ఎన్నికల సంఘం పంపిన లేఖతో, ఆమె పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక కీలక ఘట్టం పూర్తయింది. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన రాజకీయ కార్యకలాపాలను ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో ముందుకు తీసుకెళ్లనున్నారు.

