మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం –రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల ను వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నిసార్లు వివరించినా తీరు మారక పోవడం
మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపానన్నారు. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించినట్లు వెల్లడించారు.
హరీష్ రావు ఫైర్
జూపల్లి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు అని వెల్లడించారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారన్నారు. మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదని మండిపడ్డారు.
బహిరంగ రహస్యం
నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమేనన్నారు. జూపల్లి … బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, అలాగే మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను వాట్సాప్కు పంపిస్తున్నానన్నారు. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నానన్నారు. ఇకనైనా అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.

