TELANGANA

మూసీ పునరుజ్జీవనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ రూపురేఖలను మార్చేసే ప్రతిష్టాత్మక ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ కీలక దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తొలి విడతలో భాగంగా రూ. 7,345 కోట్ల భారీ బడ్జెట్‌తో 21 కిలోమీటర్ల మేర మూసీ నది సుందరీకరణ, పునరుద్ధరణ పనుల టెండర్లకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాదు, ఈ మెగా ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా 147 కొత్త పోస్టుల మంజూరుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలపడం విశేషం.

 

విద్యారంగంలో విప్లవాత్మక మార్పు..

విద్యార్థుల సంక్షేమంతో పాటు విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వారితో పాటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారంతో కూడిన మధ్యాహ్న భోజన సదుపాయాన్ని విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వినూత్న నిర్ణయం విద్యా వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

 

వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట..

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కాకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)తో పాటు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రధాన వైద్య సంస్థల్లో ఏకంగా 6,278 కొత్త పోస్టుల మంజూరుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వ వైద్య రంగం మరింత బలోపేతం కానుంది. అలాగే, వివిధ ప్రభుత్వ సంస్థలు, అధునాతన గోదాములు, విద్యాసంస్థల శాశ్వత నిర్మాణాల కోసం అవసరమైన భూములను కేటాయించాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది.

 

వీబీ జీరామ్‌జీ పథకంపై కీలక అడుగు..

రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ (VB Jiramji) పథకం అమలుకు సంబంధించి ఎదురవుతున్న కొన్ని న్యాయపరమైన చిక్కులు, అభ్యంతరాలను అధిగమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. న్యాయపరంగా అన్ని లైన్లను క్లియర్ చేసుకుని, ఈ పథకాన్ని పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్.. అటు మౌలిక సదుపాయాల కల్పన, ఇటు విద్య, వైద్య రంగాలు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది