పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూటు మార్చారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఆమె బయటకు వచ్చారు. నల్లటి న్యాయవాది గౌను ధరించి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎన్నికల సందర్భంగా జరిగతిన హింసాకాండ ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కలకత్తా హైకోర్టుకు హాజరయ్యారు.
రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్కత హైకోర్టుకు హాజరయ్యారు. టీఎంసీ పార్టీ అధికారం పోయిన తర్వాత తొలిసారి ఆమె న్యాయవాది గౌను ధరించి న్యాయస్థానం ముందుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారణ కోసం బయటకు వచ్చారు.
టీఎంసీ సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరుగుతోంది. దశాబ్దమున్నర టీఎంసీ పాలన ముగింపు తర్వాత జరిగిన దాడులు, రాజకీయ ప్రతీకార చర్యలపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగారు.
న్యాయవాదిగా న్యాయస్థానానికి మాజీ సీఎం హాజరు
న్యాయస్థానం ముందు మమత హాజరు కావడం వెనుక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని, బెంగాల్ ప్రజల అవసర సమయంలో ఎన్నడూ విడిచిపెట్టరని ఆ పార్టీ తెలిపింది. సత్యం, న్యాయం, రాజ్యాంగ విలువల కోసం తన పోరాటానికి కట్టుబడి ఉన్నారని టీఎంసీ పేర్కొంది.
చారిత్రాత్మక ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత కలహాల నేపథ్యంలో విమర్శలను ఎదుర్కొంటున్న టీఎంసీకి రాజకీయంగా సంక్షోభం సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మే నాలుగున ఫలితాలు వెలువడినప్పటి నుండి బెంగాల్లోని పలు జిల్లాల్లో ఘర్షణలు, విధ్వంసం, బాంబు దాడులు, ప్రతీకార దాడులతో సహా రాజకీయ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అధికార బీజేపీ-విపక్ష టీఎంసీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెల్సిందే.

