TELANGANA

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త మండల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వేగంగా కొత్త కమిటీలు ఏర్పాటు కావాలని టీపీసీసీ ఆదేశించింది. అయితే ఇప్పటికే మూడేళ్ల పాటు కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం లేదు. కొత్తోళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. కానీ కొత్తగా మండల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వారు, అప్పటికే పార్టీలో కనీసం మూడేళ్ల పాటు కార్యకర్త గా పనిచేసి ఉండాలి. ఈసారి కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పారదర్శకమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది. ప్రధానంగా యువతకు, క్షేత్రస్థాయిలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని టీపీసీసీ(TPCC) సూచించింది. ఇక స్థానిక జనాభాను బట్టి మండల కమిటీల సంఖ్య 11 నుండి 21 లోపు మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 21 దాటకూడదని పార్టీ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్లమెంట్ సెగ్మెంట్ ల వారీగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోపు వంద శాతం కమిటీలు ఏర్పాటు కావాలని సూచించారు.

 

సమన్వయం మస్ట్..

ఇక కొత్తగా ఏర్పాటయ్యే కమిటీలు సమన్వయం, ఏకాభిప్రాయం కాకపోతే సదరు లిస్టును టీపీసీసీ కంట్రోల్ రూమ్ కు పంపాలని పార్టీ ఆదేశాలిచ్చింది. స్థానికంగా ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తల అభిప్రాయల మేరకు కమిటీలు ఏర్పాటు కావాలని పార్టీ స్పష్టంగా ఆదేశించింది. ఒకటికి రెండు సార్లు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారి అభ్యర్ధిత్వాన్ని పరిశీలించి కమిటీలు ఎంపిక చేయాల్సిన అవసరం ఉన్నట్లు టీపీసీసీ నొక్కి చెప్పింది. కమిటీలు ఏర్పాటులో ఎలాంటి జాప్యం, అవకతవకలు, నిర్లక్ష్యం వంటివి బహిర్గతం కావొద్దని టీపీసీసీ నుంచి అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ఇక బూత్ లెవల్ ఏజెంట్ల నియామాకల్లోనూ యూత్ కు ప్రయారిటీ ఇవ్వాలని పార్టీ సూచించింది.

 

ఓట్లు లేపేస్తారు.. జర భద్రం..

ఇక గ్రామ స్థాయిలో కార్యకర్తలు, కమిటీలు, మండల స్థాయిలోని కమిటీలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ ఆదేశాలిచ్చింది. ఎస్ ఐఆర్ ద్వారా ఓట్లు దోపిడి జరిగే ప్రమాదం ఉన్నదని, ఇతర రాష్ట్రాల్లో ఇదే జరిగినట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దీంతో కమిటీలన్నీ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎప్పటికప్పుడు ఎస్ ఐఆర్ ను పరిశీలిస్తూ ఉండాలని, అనుమానం, వివాదాలు స్పస్టమైతే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలన్నారు. తాను అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడే ఎస్ ఐఆర్ అని, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నట్లు పార్టీ వివరించింది. ఇందుకోసం బీఎల్ వోలు సమర్ధవంతంగా ఫోకస్ పెట్టాలన్నారు. ఇక రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు, పార్టీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఏఐసీసీ అందరికీ సరైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.