National

ఆధార్ కొత్త నిర్ణయం…!

టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషితో మమేకం అయ్యింది ఆధార్. వినియోగదారులు ఎక్కడకు వెళ్లినా కచ్చితంగా ఆధార్ తీసుకెళ్లాల్సిందే లేకుంటే చివరకు బస్సులు సైతం ఎక్కనీయరు. తాజాగా ఆధార్‌కు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ యాప్‌ని క్లోజ్ చేసింది ప్రభుత్వం. అసలేం జరిగింది?

 

ఆధార్ కొత్త నిర్ణయం

 

టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తోంది కేంద్రం. ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే విషయంలో రకరకాల మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ విషయంలో మార్పులు చేర్పులు చేసింది. స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ సేవల కోసం కీలక మార్పును ప్రకటించింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ‘ఎమ్-ఆధార్’ యాప్‌ను పూర్తిగా నిలిపి వేయనున్నట్లు ప్రకటన చేసింది.

 

దీని స్థానంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ అధికారికంగా ‘ఆధార్’ యాప్‌ను తీసుకొచ్చింది. ఇది మరింత భద్రత, ఆధునిక ఫీచర్లతో కూడినది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎక్స్‌ ద్వారా కోరింది. పాత యాప్‌లో లాగిన్ కాకుంటే అథెంటికేషన్ సమయంలో యూజర్ల పూర్తి వివరాలు కనిపించేవి.

 

ఆ యాప్ క్లోజ్, వినియోగదారులు డోంట్‌ వర్రీ

 

కొత్త యాప్‌లో డేటా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. హోటళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వెరిఫికేషన్ కోసం పూర్తి వివరాలను చూపించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. యాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అవసరమైన సమాచారాన్ని షేర్ చేయవచ్చు.

 

ఎస్ఎంఎస్ ఓటీపీలపై ఆధారపడకుండా ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ చేయడం వంటి అదనపు భద్రతా ఫీచర్లు చేర్చారు. వినియోగదారులు తమ వేలిముద్రలు, ఐరిస్ ద్వారానే లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ‘ఆధార్’ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ కాగానే నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి.

 

ఆధార్ కార్డ్‌కు లింక్ ఉన్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు ఫేస్ అథెంటికేషన్ అడిగే అవకాశం ఉంది. యాప్ సెక్యూరిటీ కోసం పిన్ నంబర్‌ను క్రియేట్ చేసుకోవాలి. బయోమెట్రిక్ అన్‌లాక్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్‌ను జోడించి మరో ఓటీపీతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

 

యాప్ మార్పుతో పాటు ఆధార్ వినియోగదారులకు మరో తీపి కబురు అందించింది. మై ఆధార్ పోర్టల్‌లో ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును మరికాస్త పొడిగించింది. ఈ ఉచిత సేవలు ఈ ఏడాది జూన్ 15 వరకు మాత్రమే. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2027 జూన్ 14 వరకు ఎలాంటి రుసుము లేకుండా అప్‌డేట్ చేసుకునే సౌకర్యం కల్పించింది.