ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ నిర్వహణపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఈ నియామక ప్రక్రియ అంతా పక్కా ప్లానింగ్తో, అత్యంత పారదర్శకంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల మెరిట్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి తొలి సంతకం.. భారీ నోటిఫికేషన్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 2024 జూన్ 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం పీఠంపై కూర్చుంటూనే ‘మెగా డీఎస్సీ’ ఫైల్పై తన మొదటి సంతకం చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు.
పటిష్టమైన భద్రత.. లీకేజీలకు తావులేకుండా..
ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రముఖ సంస్థ ‘టాటా అయాన్’ (Tata iON) కు అప్పగించారు. మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్ను వాడటం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ లేదు. పైగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానం కావడం వల్ల ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదని విద్యాశాఖ పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు
అభ్యర్థుల సౌకర్యం కోసం ఏపీలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పక్క రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంత పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తే, కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది.

