TELANGANA

పవన్ సంచలన ప్రకటన..! తెలంగాణలో జనసేన పోటీ..!

హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు అర్పించారని పవన్ గుర్తుచేశారు. వారిపైన ఉన్న గౌరవంతో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పాలకుల గురించి ఒక్కమాట కూడ అనలేదని అన్నారు. తెలంగాణ అంటే తనకు అంత ఇష్టమని స్పష్టం చేశారు.

 

తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను శంకిస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ‘నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది. మేం పోటీ చేస్తాం. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా. ప్రతీ సమస్యమీద మాట్లాతాం. ప్రతీ అన్యాయాన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. అది మర్చిపోకండి’ అంటూ తనను విమర్శిస్తున్న నేతలకు పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో జనసేన ఉంటుంది.. మేము పోటీ చేస్తాం

ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం

2029 తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక్కడ కూడా తెలుగుదేశంతో పొత్తుతో వెళ్తారా? అన్న ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఎవరి పార్టీ వారు చెప్పుకోవాలి. నాకు తెలియదు అది. అలాగే బీజేపీ పార్టీ కలిసి వస్తుందో లేదో కూడా నాకు తెలీదు’ అని పవన్ అన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఇటీవల మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని ప్రకటించారని పవన్ గుర్తుచేశారు. తాను కూడా తమ నాయకులు.. సొంతంగా పోటీ చేసుకునేలా ఫ్రీడమ్ ఇస్తానని అన్నారు.

 

అంతకుముందు పవన్ మాట్లాడుతూ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. జనసేన వస్తుందంటే.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తుందని ఇక్కడి నేతలకు భయమని అన్నారు. 4 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణలో జనసేనకు లక్ష మంది సపోర్టర్స్ కూడా లేరని పేర్కొన్నారు. 2000 మంది సాధకులతో సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదంటే ఇంకేం చేస్తామని పవన్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రొఫెసర్ వివాదంలో ప్రాంతాలు, కులాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. మీ ఇష్టానికి మీరు మాట్లాడితే కనీసం ఖండించే హక్కు కూడా లేదా? అని నిలదీశారు