రైతులకు, వ్యవసాయ రంగానికి ఆందోళన కలిగించే ఒక కీలక అప్డేట్ వాతావరణ శాఖ నుండి వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో దేశంలోని దాదాపు 12 రాష్ట్రాలపై ‘ఎల్ నినో’ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఖరీఫ్ 2026 సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని కీలక వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో ఉన్న జిల్లా అధికారులు, రాష్ట్రాల వ్యవసాయ విభాగాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఇతర అనుబంధ సంస్థలతో తక్షణమే సమన్వయ సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కరువు లాంటి పరిస్థితులు ఎదురైతే ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

