“ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోంది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పేదవాడి ఓటు హక్కునే కాలరాస్తున్నారు” అంటూ వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్లకు కనీసం ఫారాలు ఇవ్వకుండానే, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ వేలాది మంది పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా? ఓటు లేకపోతే పేదలు సంక్షేమ పథకాలకు ఎలా అర్హులవుతారు?” అని ప్రశ్నించారు.
టీడీపీ శ్రేణులు ఒక ప్రత్యేక యాప్ను ఉపయోగించి ఓటర్ల జాబితాలో అక్రమంగా జోక్యం చేసుకుంటున్నాయని జగన్ ధ్వజమెత్తారు. తమకు అనుకూలమైన వారి ఓట్లను చేర్చుతూ, వ్యతిరేకంగా ఉన్న పేదల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీసే చర్యని పేర్కొన్నారు. మంత్రి నారాయణ, ఒక మున్సిపల్ కమిషనర్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఓ ఫోన్ సంభాషణ ఆడియోను జగన్ ఈ సందర్భంగా మీడియాకు వినిపించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికార యంత్రాంగంపై అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లీక్ అయిన ఆడియోనే నిదర్శనమని అన్నారు.

