AP

61 ఏళ్ల భూ సమస్యకు తెరదించిన సీఎం చంద్రబాబు..! రైతుల కళ్లలో ఆనందం..

ఆరు దశాబ్దాలుగా తమ బతుకుల్లో అలుముకున్న అనిశ్చితికి తెరపడింది. మూడు తరాలుగా సాగుచేస్తున్న భూమికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తమదన్న హక్కు పత్రాలు చేతికి అందడంతో ఆ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. శనివారం కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ పట్టాలను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, కంగుంది రైతుల సమస్య తనను చాలాకాలంగా కలచివేసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు భూమి కోసం పడుతున్న వేదనకు ముగింపు పలకడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని, క్షేత్రస్థాయిలో సమగ్ర రికార్డులను పరిశీలించి, న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేసి ముందుకు సాగినట్లు వివరించారు.

 

ఈ భూమి అటవీ పొరంబోకుగా రికార్డుల్లో ఉండటంతో హక్కులు కల్పించడం క్లిష్టంగా మారిందని, దీనిని ‘అసైన్డ్ వేస్ట్ డ్రై’ భూమిగా వర్గీకరణ మార్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తీసుకున్నామని తెలిపారు. న్యాయం రైతుల పక్షాన ఉండటంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం సాధ్యమైందని, కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు ఈ కార్యక్రమమే నిదర్శనమని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

ఏడాదిలో భూ వివాద రహిత రాష్ట్రం

 

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అనేక భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇటీవలే తిరుపతి సమీపంలోని శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు, రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో వందల ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాన్ని కూడా పరిష్కరించామని తెలిపారు. ఇప్పుడు కంగుంది సమస్యకు తెరదించామని, రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని భూ వివాదాలను పరిష్కరించి, భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

 

గత పాలనపై విమర్శలు.. అభివృద్ధిపై భరోసా

 

గత ఐదేళ్ల పాలనలో భూ వివాదాలను పరిష్కరించకపోగా, కొత్తవి సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల సొంత ఆస్తి అయిన పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫొటోలు ముద్రించుకోవడం దారుణమని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగించి, ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాస్‌బుక్‌లను అందించిందని గుర్తుచేశారు. ఇకపై రౌడీయిజం, గూండాయిజానికి రాష్ట్రంలో చోటులేదని హెచ్చరించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కుప్పం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.

 

కుప్పం ప్రజలు సౌర విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, నెట్ జీరో విధానంలో ‘స్వచ్ఛ కుప్పం-స్వర్ణ కుప్పం’ సాధించాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని, వారి ఉత్పత్తులను ‘స్వయం’ బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్తామని వివరించారు. “మేం రాష్ట్రంలో అభివృద్ధి అనే యజ్ఞం చేస్తుంటే, గొడ్డలి పార్టీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. వారి కుట్రలను ప్రజలు గమనించాలి,” అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.