తెలంగాణ ఆర్థిక రంగానికి, సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘తాడిచర్ల-2’ బొగ్గు బ్లాక్ను నేరుగా సింగరేణి సంస్థకే కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో సంతకం చేశారు. ఈ మైనింగ్ లీజ్ కేటాయింపు తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెర..
తాడిచర్ల-2 బ్లాక్ను సింగరేణికి ఇవ్వాలనే డిమాండ్ ఈనాటిది కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయం నుంచే నాటి ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చారు. అయితే, ఎట్టకేలకు ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభించింది. ఈ బ్లాక్ కేటాయింపుపై కొంతకాలంగా ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుమతి కోరగా, తెలంగాణ అభివృద్ధిపై సానుకూల దృక్పథంతో ఉన్న ప్రధాని ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రూ. 64,000 కోట్ల ఆదాయం..
ఈ తాడిచర్ల-2 బ్లాక్ లో దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీని ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయవచ్చు. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల పాటు ఈ గని నుండి ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉంది. పైగా ఇక్కడి బొగ్గు గ్రేడ్-8 క్వాలిటీకి చెందింది కావడం విశేషం. ఈ బ్లాక్ ద్వారా మొత్తంగా రూ. 64,000 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సాధారణంగా వేలం (ఆక్షన్) ద్వారా కాకుండా నేరుగా సింగరేణికి ఇవ్వడం వల్ల సంస్థకు ఆక్షన్ ప్రీమియం భారం తప్పుతుంది. దీనివల్ల సింగరేణికి కనీసం రూ. 2,550 కోట్లు మిగులుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో దాదాపు రూ. 16,000 కోట్ల భారీ ఆదాయం సమకూరుతుంది.
అదనంగా ఉద్యోగాల కల్పన
ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా నిరుద్యోగులకు కూడా మేలు జరగనుంది. తాడిచర్ల-2 కోల్ బ్లాక్ ద్వారా సుమారు 1,200 మందికి అదనంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనికి తోడు నైని కోల్ బ్లాక్ ద్వారా కూడా మరో 1,500 కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తును మార్చేలా ఈ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

