TELANGANA

హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!..

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వేదికపై పార్టీ సభ్యత్వాల జిల్లా ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..

సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా పరిశీలన (SIR) ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న మన బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతిరోజూ బీఎల్ఓ (BLO) లతో పాటే ఇండ్ల చుట్టూ తిరుగుతూ ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అధికార పార్టీ అక్రమంగా ఓట్లను తొలగించకుండా పకడ్బందీగా పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలి” అని ఆదేశించారు.

 

ఫిర్యాదులే ముఖ్యం..

ఓట్ల తొలగింపు లేదా చేర్పుల్లో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయని అనుమానం వస్తే.. కార్యకర్తలు ఎవరూ తొందరపడి గొడవలు పెట్టుకోవద్దని, సాక్ష్యాలతో సహా వెంటనే సంబంధిత ఆర్డీఓ (RDO) కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేయాలని సూచించారు.

 

హ్యాం రోడ్లు పెద్ద స్కామ్!

ఈ నెల జూన్ 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) పద్ధతిలో రోడ్లు వేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్లగొండలో పెద్ద స్కామ్కు తెరలేపడానికి వస్తున్నారు. ఈ హ్యాం రోడ్ల ముసుగులో దందా చేస్తున్నారని అన్నారు.