టెక్నాలజీ మారుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు తమ రూట్ మారుస్తున్నారు. జనాన్ని బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను లూటీ చేసేందుకు సరికొత్త స్కెచ్ వేశారు. ఈ నేపథ్యంలోనే నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు.
ఎన్నికల అధికారుల పేరిట నకిలీ ఫోన్ కాల్స్
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి సైబర్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. తాము ‘ఎన్నికల అధికారులం’ అంటూ ప్రజలకు ఫోన్లు చేస్తున్నారు. ‘మీ ఓటు కార్డు ఆధార్తో లింక్ కాలేదు.. లేదా మీ ఓటు లిస్ట్ నుంచి తొలగించబడింది.. మళ్లీ యాక్టివేట్ చేయాలి’ అంటూ నమ్మిస్తున్నారు. ఆపై డిజిటల్ వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంక్ వివరాలను లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటు ఎంత విలువైందో.. వ్యక్తిగత సమాచారమూ అంతే!
ఈ సైబర్ మోసాలపై స్పందించిన సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ‘సమాజంలో మీ ఓటు ఎంత విలువైందో.. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు కూడా అంతే విలువైనవి’ అని ఆయన గుర్తు చేశారు. అధికారికంగా పనిచేసే ఎన్నికల అధికారులు గానీ, బీఎల్ఓలు (BLO) గానీ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత ఓటీపీలు (OTP), పిన్ నంబర్లు లేదా బ్యాంక్ వివరాలను అడగరనే నిజాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు.
మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కేటుగాళ్ల బారిన పడకుండా ఉండటానికి పోలీసులు పలు సూచనలు చేశారు. ‘గుర్తుతెలియని వ్యక్తులకు లేదా ఎన్నికల అధికారులమని చెప్పే ఎవరికీ ఫోన్లో ఓటీపీలు చెప్పకండి. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సదరు ఫోన్ కాల్ కట్ చేసి, స్థానిక ఎన్నికల కార్యాలయాన్ని స్వయంగా సంప్రదించండి. ఒకవేళ ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి’ అని సీపీ విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తతే మనల్ని, మన సొమ్మును కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

