అమెరికా మరోసారి ఇరాన్పై దాడులకు సిద్ధమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత రాత్రి భారీ దాడులు నిర్వహించామని తెలిపారు. అవసరమైతే మరోసారి కూడా అదే స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ తీరుతెన్నులు మారకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టర్కీలోని అంకారాలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్పై మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని ప్రస్తావించారు. గత రాత్రి తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించామని, అవసరమైతే ఈ రాత్రి కూడా అదే తరహా దాడులు చేస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటమే దీనికి కారణమని ఆరోపించారు.
ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసిన తర్వాత కాల్పుల విరమణ కొనసాగబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో చర్చలు జరపడం వృథా అని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చర్చలు కొనసాగించేందుకు అమెరికా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అయితే వాటి ఫలితాలపై మాత్రం సందేహం వ్యక్తం చేశారు.
తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం ముదిరుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు ఐదు శాతానికి పైగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

