ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమైంది. పశ్చిమ ప్రకాశంలోని కరవు పీడిత ప్రాంతాలకు జీవనాడిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ప్రాజెక్టు సొరంగాల నుంచి ఉరకలేస్తూ వచ్చిన కృష్ణా జలాలకు ఆయన భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ చారిత్రక ఘట్టంతో ఆ ప్రాంత రైతులు, ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఈ సందర్భంగా గంటవానిపల్లె ఫీడర్ కెనాల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వయంగా నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, చీర సమర్పించి హారతి ఇచ్చారు. అంతకుముందు, జలహారతి ప్రదేశానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి గిరిజన మహిళలు తమ సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పండితులు ముఖ్యమంత్రికి శ్రీశైలం మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు.
నల్లమల కొండలను తొలుచుకుంటూ నిర్మించిన రెండు భారీ సొరంగాల నుంచి కృష్ణా జలాలు గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని, అక్కడి నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి పరుగులు తీశాయి. ఈ దృశ్యాన్ని సభా ప్రాంగణం నుంచి వీక్షించిన మార్కాపురం రైతులు, మహిళలు పులకించిపోయారు. తమ ప్రాంతానికి కృష్ణమ్మ రావడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.
ఈ చారిత్రక కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, డీబీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్, పార్ధసారధి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దశాబ్దాల నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించిందని, ఇచ్చిన మాట ప్రకారం వెలిగొండను పూర్తి చేసిందని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

