TELANGANA

ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన విమర్శించారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.

వరద నీరు లేకున్నా, ఎటువంటి కేటాయింపులు లేకుండానే కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం వెలిగొండ ద్వారా నీటిని యథేచ్ఛగా తరలిస్తోందని హరీశ్ రావు ఆక్షేపించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి ఎద్దడి ఏర్పడి భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులు ఎండిపోతుంటే, ఏపీ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలించుకుపోవడం తెలంగాణ రైతాంగ హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు.

ఇప్పటికే మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలించుకుపోయిందని, ఇప్పుడు వెలిగొండ వంతు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ఆయకట్టుకు నీరందించడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏపీ చర్యలపై ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఇది ఏపీకి పరోక్షంగా సహకరించడమేనని ఆరోపించారు. నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సైతం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈ వివాదంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీపై ఒత్తిడి తీసుకువచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపేలా చూడాలని, తద్వారా ఆయకట్టుకు నీరందించాలని కోరారు.