National

ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం.. నాణ్యతా లోపాలే కారణం..

ప్రముఖ మసాలా దినుసుల బ్రాండ్లు ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్, లాల్జీ గోధూ కంపెనీలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలు విక్రయిస్తున్న కాంపౌండెడ్ ఇంగువ (హింగ్ పౌడర్) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, వాటి అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.

మార్కెట్‌లో నిరంతర నిఘా, చట్టపరమైన నమూనాల సేకరణ అనంతరం జరిపిన పరీక్షల్లో ఈ రెండు కంపెనీల ఇంగువ ఉత్పత్తులు నాణ్యత తక్కువగా (సబ్‌-స్టాండర్డ్) ఉన్నాయని, కొన్ని సందర్భాల్లో తప్పుడు బ్రాండింగ్ (మిస్‌బ్రాండెడ్) లేదా కల్తీకి గురైనట్లు గుర్తించామని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.

ఎవరెస్ట్ ఉత్పత్తుల్లో తీవ్ర లోపాలు
ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న ఇంగువ పొడి, దాని వేరియంట్లలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఒక నమూనాలో ఆల్కహాలిక్ ఎక్స్‌ట్రాక్ట్ నిబంధనల ప్రకారం కనీసం 5 శాతం ఉండాల్సి ఉండగా, కేవలం 0% ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. అదేవిధంగా, ఎవరెస్ట్ యెల్లో హింగ్ పౌడర్‌లో 3.29%, బ్లాక్ హింగ్ పౌడర్‌లో 4.4 శాతం మాత్రమే ఆల్కహాలిక్ ఎక్స్‌ట్రాక్ట్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా ఈ కంపెనీకి చెందిన చికెన్ మసాలా, గరం మసాలా, ఎగ్ కర్రీ పౌడర్ వంటి ఉత్పత్తుల లేబులింగ్‌లో లోపాలు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తుచేసింది.

లాల్జీ గోధూ ఇంగువలోనూ అదే పరిస్థితి
లాల్జీ గోధూ కంపెనీకి చెందిన పొడి, గడ్డల రూపంలో ఉన్న ఇంగువ నమూనాలు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. అంతేకాకుండా, ఇంగువ తయారీకి ఉపయోగించే ముడిసరుకులోనూ అధికంగా స్టార్చ్ (పిండి పదార్థం) ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఇంగువలో స్టార్చ్ ఒక శాతానికి మించి ఉండకూడదు. మార్కెట్‌లో సేకరించిన పలు బ్యాచ్‌ల నమూనాల్లో ఈ ఉల్లంఘనలు విస్తృతంగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

ఈ నేపథ్యంలో, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎవరెస్ట్, లాల్జీ గోధూ కంపెనీలు తమ ఇంగువ ఉత్పత్తుల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. తమ ఉత్పత్తుల్లోని లోపాలను సరిదిద్దడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని, ఇకపై కేవలం నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే తయారుచేసి విక్రయించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను పాటించని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.