National

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు.. సర్వం సిద్ధమన్న ప్రధాని మోదీ..

ఈ వారాంతంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సర్వ సన్నద్ధమైంది. ఈ కీలక కార్యక్రమానికి భారత్ సిద్ధంగా ఉందని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగే ఈ 18వ బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలోని భారత్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ప్రపంచ నేతలకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన భారత్ మండపం వీడియోను షేర్ చేస్తూ, “బ్రిక్స్ 2026కు సర్వం సిద్ధం!” అని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సహా పలువురు సభ్య, భాగస్వామ్య, ఆహ్వానిత దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు.

2026 సంవత్సరానికి బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ‘సుస్థిరత, ఆవిష్కరణ, సహకారం, పునరుత్థానం కోసం నిర్మాణం’ అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది. “మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యం” అనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ థీమ్‌ను ఎంచుకున్నారు. అంతర్గత సహకారాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, పరస్పర ప్రాధాన్యత ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

సదస్సు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలతో కలిసి రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15,000 మంది పోలీస్ సిబ్బంది, 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. వీవీఐపీల రాకపోకల కారణంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలకు ముందుగానే సూచనలు జారీ చేశారు.

భారత్ బ్రిక్స్ కూటమికి వ్యవస్థాపక సభ్యదేశం. 2012, 2016, 2021లో కూడా భారత్ అధ్యక్షత వహించింది. ఇప్పుడు నాలుగోసారి ఈ బాధ్యతను స్వీకరించింది. 2026తో బ్రిక్స్ కూటమి ఏర్పడి 20 ఏళ్లు పూర్తి కావడం మరో విశేషం. ఈ ఏడాది జనవరి 1న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్ దాదాపు 350కి పైగా సమావేశాలు, ఉన్నత స్థాయి కార్యక్రమాలను నిర్వహించి కూటమి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసిందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.