TELANGANA

సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా..?: కేటీఆర్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని… కేసీఆర్ హయాంలో లభించిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో మళ్లీ పాతకాలపు కరెంటు కోతలు పునరావృతమవుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన రైతులు తమ కష్టాలను వెళ్లబోసుకుంటున్న వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకుంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి వచ్చిన అసలైన మార్పు ఇదేనా?” అని కేటీఆర్ తన పోస్టులో ప్రశ్నించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఆయన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనే రైతులు విద్యుత్ కోతలతో విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా వోల్టేజ్, సమయానికి కరెంటు రాకపోవడంతో పొలాలకు నీళ్లు పారక పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు