National

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా…అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి.

ఆన్‌లైన్‌లో గేమ్ ఆడితే మస్త్ మజా వస్తుంది. నిజమే. మరి, ఫ్రీ గేమ్స్ అడితే ఓకే. మరి, డబ్బులు పోగొట్టే గేమ్స్ ఆడితేనో. అప్పుడు కదా అసలు సిసలు మజా వచ్చేది. ఓ డిగ్రీ విద్యార్ధి ఆన్‌లైన్ గేమ్ ఆడి ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 95 లక్షల రూపాయలు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న తల్లితండ్రులు..! భూ సేకరణ నష్ట పరిహారం కింద ఓ రైతు అకౌంట్‌లో ఇటీవలే కోటి రూపాయలు జమ చేయబడ్డాయ్. అది కాస్తా గేమ్ పేరుతో బూడిద చేసేశాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే, శ్రీనివాస్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులకు హర్ష వర్ధన్ రెడ్డి అను డిగ్రీ చదివే కుమారుడున్నాడు

. ఇటీవలే గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి కౌలు చేస్తున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాల కోసం తీసుకుని నష్టపరిహారం కింద ఎకరాకి 10 లక్షల చొప్పున 10 ఎకరాలకు కోటి రూపాయలు ఆ రైతు అకౌంట్‌లో జమ చేసింది. మరో చోట భూమి కొనే నేపథ్యంలో ఆ అమౌంట్‌ని తన కుమారుడి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. అయితే, మనోడు హర్షవర్ధన్ రెడ్డికి ఆన్ లైన్ గేమ్స ఆడే అలవాటు రంజుగా వుండడంతో, ‘కింగ్ 567’ అనే ఆన్ లైన్ గేమ్ డౌన్ లోడ్ చేసి ఆడాడు. ఇంకేముంది.. అకౌంట్ నుంచి 95 లక్షలు హుష్ కాకి. విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ కింద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.