AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేతికి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడం అస్త్రంగా మారింది.

సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, చంద్రబాబు అవినీతిని తూర్పారబడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

రేపో మాపో తనను అరెస్టు చేస్తారని, తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని, ఏం జరిగినా భయపడేది లేదని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు అని పేర్కొని, ఈ విధంగా చంద్రబాబు సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. గతంలో తన భార్యను అవమానించారని గుక్కపెట్టి ఏడ్చారు అని గుర్తు చేశారు.

ఇలాగైనా ప్రజల సానుభూతిని పొందవచ్చని చంద్రబాబు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తనకు ప్రజలంతా వలయంగా నిలబడి కాపాడుకోవాలని నాటకాలు ఆడినా ఎవరు పట్టించుకోలేదుగా బాబు గారు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఏ మాత్రం ఆదరించలేదని సాయిరెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు.

అంతేకాదు మొన్నటిదాకా ఆంధ్రను శ్రీలంకతో పోల్చి ఆనందం పొందారు చంద్రబాబు గారు అంటూ పేర్కొన్న ఆయన, ఇప్పుడు తాజాగా ఆంధ్ర, తెలంగాణను ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సైకియాట్రిస్ట్ కు చూపించుకోండి అన్నా వినకుండా రోడ్లపై చంద్రబాబు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

ఈ ఆంధ్ర కిమ్ కు వ్యాధి బాగా ముదిరి పీక్స్ కు వెళ్లి పోయిందని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రజల మనసులో స్థానం కోసం ఎన్ని చెప్పినా, ఏమి చేసినా జనాలకు ఎవరు ఏమిటో తెలుసనీ, చంద్రబాబు అవినీతి ఇప్పుడిప్పుడే బయట పడుతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.