AP

మంత్రులపై జగన్ సీరియస్..

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాట్ హాట్‌గా జరిగింది. ఓవైపు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూనే.. మరోవైపు మంత్రుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రులు సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారట. దీంతో మంత్రులు కూడా అసహనంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

 

కీలక నిర్ణయాలు.. ఆమోదాలు.. వార్నింగ్‌లు.. ఇలా ఏపీ కేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ప్రభుత్వం తరుఫున మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు సంగతి అటుంచితే.. ఈసారి రాజకీయ అంశాలపై ఒకింత ఎక్కువగా చర్చించారు. అది కూడా చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై హాట్ డిస్కషన్ జరిగిందని సమాచారం. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో వైసీపీ ఇమేజ్ కాస్తా తగ్గిందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారట. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని సరిగా డీల్ చేయలేకపోయారని మంత్రులపై మండిపడ్డారని తెలుస్తోంది. చంద్రబాబు తప్పు చేశారు.. అందుకే అరెస్ట్ అయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమయ్యారని సీరియస్ అయ్యారట. ఈ కేసులో రాజకీయ కక్షలు లేవని బలంగా తమ వాయిస్ వినిపించలేకపోయారని ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వాళ్లు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారని నిలదీశారట. దీంతో.. మంత్రులు కూడా మీటింగ్ తర్వాత అసహనంగా వెళ్లిపోయారని టాక్.

 

చంద్రబాబు అరెస్ట్ అంశంపై చర్చ తర్వాత ఏపీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కులగణనకు ఆమోదం తెలిపింది. 92 ఏళ్ల తర్వాత కులాలవారీగా లెక్కలు తీస్తున్నట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. దీంతో బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని మంత్రి చెప్పారు.

 

ఎప్పటిలాగే.. ఈ సారి కూడా వైద్య, విద్యా రంగంపై మంత్రులు లోతుగా చర్చించారు. ఈ రంగాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని జగన్ స్పష్టం చేశారు. అటు.. ప్రభుత్వ హైస్కూళ్లలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ఇంజినీరింగ్‌ కళాశాలలతో మ్యాపింగ్‌ అవ్వాలి డిసైడ్ అయ్యారు.దీంతో.. ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీకి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో.. త్వరలో రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడనున్నాయి.

 

అసైన్డ్‌ భూముల అంశంపై కూడా ఏపీ కేబినెట్‌లో చర్చకు వచ్చింది. అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పించాలని మంత్రిమండలి నిర్ణయానికి వచ్చింది. మరోవైపు పౌరసరఫరాల కార్పొరేషన్‌ రుణం తీసుకునేందుకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ధాన్యం సేకరణ కోసం 5వేల కోట్ల రూపాలయ లోన్ తీసుకునేందుకు ఆమోదం లభించింది. దీంతో పాటు.. పలు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ పై చర్చించారు. దీంతో.. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.