AP

జనసేనకు 40-50 సీట్లు.. చంద్రబాబుకు జాబితా అందించిన పవన్..

పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారా? ఆయనపై ఒత్తిడి పెరుగుతోందా? సీట్ల కేటాయింపు, పవర్ షేరింగ్ విషయంలో కొత్త డిమాండ్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న పరిణామాలతో కాపులు నిరుత్సాహానికి గురవుతున్నారు. టిడిపితో జనసేన పొత్తును చాలామంది వ్యతిరేకించారు. అయితే సీట్లు పెంచుకోవడంతో పాటు పవర్ షేరింగ్ విషయంలో పవన్ కు ఛాన్స్ వస్తుందని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ ఏకపక్షంగా చంద్రబాబు మాత్రమే సీఎం గా ఉంటారని తేల్చి చెప్పిన నాటి నుంచి కాపుల్లో అంతర్మధనం ప్రారంభమైంది. దీంతో కాపుల నుంచి సరికొత్త డిమాండ్లు పవన్ కు వస్తున్నాయి.

 

More

From Ap politics

ప్రధానంగా సీట్ల విషయంలో రాజీ పడవద్దని.. 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేయాలని.. అప్పుడే కూటమి అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ సాధ్యమని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కూటమి విజయం సాధిస్తే సింహభాగం ప్రయోజనాలను జనసేన పొందాలని కాపులు ఆకాంక్షిస్తున్నారు. అందుకు సీట్లు పెంచుకుంటేనే డిమాండ్ చేయగల బలం వస్తుందని గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా గెలిచే సీట్లలో సరైన వాటా తీసుకోవాలని సూచిస్తున్నారు. లోకేష్ వ్యాఖ్యల తర్వాత పవన్ పై ఒత్తిడి ప్రారంభమైంది. అట్టు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరి రామ జోగయ్య లేఖ సైతం విను ప్రకంపనలకు దారితీసింది. కాపు సమాజం ఒత్తిడి తట్టుకోలేక పవన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం.

 

జనసేనకు పొత్తులో భాగంగా 27 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కాపులకు నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇంత తక్కువ సంఖ్యలో సీట్లు పొందడంతో ఎటువంటి ప్రయోజనం ఉండదని… రేపు కూటమి అధికారంలోకి వస్తే సంఖ్యాబలాన్ని అనుసరించి.. టిడిపి ఏకపక్షంగా పవర్ షేరింగ్ సాధించే అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ముందుగా పవన్ కళ్యాణ్ పైనే ప్రయోగిస్తారని.. అదే జరిగితే పవన్ రూపంలో కాపులకు అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గంలో ఆందోళన నెలకొంది. దీంతో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. దీనిని ఇలాగే విడిచి పెడితే తిరుగుబాటు రూపంలో తమపై ప్రతికూలత చూపుతోందని పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. వీలైనంత ఎక్కువ సీట్లు టిడిపి నుంచి దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 45 నుంచి 50 సీట్లను పవన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ జాబితాను చంద్రబాబుకు అందించినట్టు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో టిక్కెట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై టిడిపిలో సైతం తర్జనభర్జన జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఉన్నపలంగా పవన్ డిమాండ్ తో టిడిపి నాయకత్వం ఆశ్చర్యపడినట్లు తెలుస్తోంది. అయితే సీట్ల విషయంలో పవన్ వెనక్కి తగ్గకుండా కాపు సంఘాల నేతలు, ప్రముఖులు జనసేనానిపై ఒత్తిడి పెంచుతున్నారు. ఎక్కువ సీట్లు పొందేలా వ్యూహరచన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.